Archive for the ‘బామ్మ బ్లాగాయణం’ Category

h1

అమృతతుల్యమైన ఆదివారం

April 30, 2012
                             వరుసకి బావగారైనా అలవాటుగా అన్నయ్యా అని పిలుచుకునే శ్రీ సి వి సుబ్బారావు గారు ఎన్నాళ్ళనుంచో ఓ విషయం చెబుతూ వచ్చారు. అదే నీహారికా ఇ సర్కిల్ గురించి. పని భారమో లేక మరోటో ఆ వైపు ఆలోచన సాగిద్దామనుకుంటూండగానే కాలం పరుగెట్టెస్తోంది. ఎప్పుడో నాకా విషయం గుర్తుకు రావడం, అంతలో ఏదో పని ముంచుకురావడం ఇలా రోజులు దొర్లిపోతుండగా ఈ మధ్యనే ఆ ఇ సర్కిల్ లో సభ్యులు అయ్యాం. అయ్యీ అవ్వగానే ఓ అధ్భుత కార్యక్రమం వారు నిర్వహించారు. అదే “బాలు నేను నా స్వరకర్తలు”. అసలీ కార్యక్రమానికి వెళ్ళగలమా లేదా అన్న్నంత పని ఉన్నా పక్కన పెట్టి వెళ్ళాము. బాలు పాట గురించి ప్రత్యేకంగా నే చెప్పక్కర్లే! జగదానందకారకం బాలు గళం! ఆ మహానుభావుడ్ని దగ్గరగా చూసే అవకాశం, ఆయన సంగీత విభావరి వినే అవకాశం ఇంతకుముందు వచ్చినా ఈ సారి అదో ప్రత్యేకం! ఎందుకంటే గత కొద్ది కాలంగా శ్రీ రమణ గారి మిధునం లో అప్పదాసుని బాలుగారి లో ఎలా చూడాలి? అప్పదాసు మరీ కట్టె పుల్లలా ఉంటాడని కదా రమణ గారు చెప్పింది, మరి మన బాలు ఎలా? అన్న ప్రశ్న ఓ వైపుండగా మరో వైపు, అప్పదాసు వడియాల పైనా, వాళ్ళావిడ బుచ్చి పైనా సరదాగా సంగీతమయంగా అతి సునాయాసంగా అలా, అలా వేసే డైలాగులు బాలు గారైతే మహాధ్భుతంగా పండిస్తారని నా మనసు చెబుతోంది. కొబ్బరి పచ్చడి అయ్యే వరకూ అటకపై కూర్చొన్న అప్పదాసు నోట్లోంచి వచ్చే ఆ శాపనార్ధాలు, అవీ, బాలుగారి గొంతు ఎంతో రమ్యంగా  పలికిస్తుందని గట్టి నమ్మకం మరో పక్క! ఇలా రోజుకో సన్నివేశాన్ని, అప్పదాసుగా బాలు గారిని ఊహించుకుంటున్న ఈ రోజుల్లో బాలు గారిని చూసే అవకాశం రావడం ఇక్కడ ప్రత్యేకత! ఒక్క చూడ్డం ఏమిటి, ఆయనా మాటా పాటా విని అదీ దగ్గరగా కుర్చుని లైవ్ ఆర్కెస్ట్రా తో ఆనందించే మహాధ్భాగ్యం కలిగింది ఈ ఆదివారం నాడు. అందుకే, అమృతతుల్యమైనదీ ఆదివారం అన్నాను! ఇదిలా ఉంటే బాలు పాటల్లో నా కిష్టమైనవన్నీ ఆయన పాడడం మరో ఎత్తు. గమ్మత్తైన గళం ఆయనిది. ఏ సందర్భం లో వచ్చే పాటైనా ఇట్టె అలవోకగా పలికించేస్తారు. అసలు.. పాటా పాడేవాళ్ళూ, ఏదైనా వాయిద్యాన్ని వాయించే వాళ్ళన్నా నాకు వల్లమాలిన అభిమానం, వాళ్ళమీద ఏదో చాలా పేద్ధ గౌరవ భావం, వాళ్ళు  మామూలు మనుషులు కాదు.. ఇంద్రజాలికులో.. గంధర్వులేమో అని అనుకుంటూ ఉంటాను. సంగీతాన్ని ఆస్వాదించగలగడం ఓ గొప్ప వరం అయితే సంగీతాన్ని ఆలపించే వాళ్ళకది దేవుడిచ్చిన ఇంకా గొప్ప వరం.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు బాలు వినయం, విధేయత ఆయనకు మరింత అందాన్నిస్తుంది. నేనెక్కడో చదివాను బాలు గారు పాట వచ్చిందంటే అప్పట్లో ( ఇది డెభ్భైల్లో మాట) ధియెటర్ లో కుర్చీలను బ్లేడు తో పరపరా కోసేసేవారట.( ఎక్కడ చదివానో గుర్తులేదు….పుస్తకాల పురుగుని కదా! చదివేసి అప్పటి ఆ ఆకలి తిరగానే మర్చిపోతూ ఉంటాలెండి) ఎంత అయిష్టత, విముఖత. ఆయన ఎలా భరించారో కదా! ఏదో చిన్న మాటంటేనే కోపం పొడుచుకు వస్తుందీ తరం వాళ్ళకి. మరి అంత విముఖత వ్యక్తం చెసిన వాళ్ళే ఆ తర్వాత బ్రహ్మ రధం పట్టారంటే బాలు గారి కృషిని చెప్పుకోవాలి సరే దానికంటే ముందు అంత అయిష్టతనీ సహించిన ఆయన మనస్తత్వానికి శతకోటి వందనాలు సుమీ!బాలు గారు….. నిఝంగా నమస్సులండీ!
బాలు గారు మాట్లాడుతుంటే అలా వింటు ఉండిపోవాలనిపిస్తుంది. అంత తియ్యగా ఉంటుంది. అసలే తేనెలూరు తెలుగు ఇక అది  సాక్షాత్తూ సరస్వతీ దేవి నోటివెంట వస్తొందా అన్నటుగా సుస్పష్టంగా బాలు గారు మాట్లాడుతుంటే ఓహ్ అధ్భుతం.
సరస్వతి అంటే గుర్తుకు వచ్చిందండీ అసలీ ఈవెంట్ సృష్టి కర్తలు శ్రీ ప్రదీప్, ఆయన శ్రీమతి సరస్వతీ ప్రదిప్ లు. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం కలిశాను సరస్వతి గారిని ఇప్పటికీ అదే తీరు. ఆవిడ కట్టు బొట్టూ మాట తీరు ఉఛ్ఛారణ ఎంతో బావుంతాయి. వాళ్ళమ్మాయి నీహారికని చిన్నప్పుడు చూసాను. ఇప్పుడు డాక్టర్ చదువుతొందట. అన్నట్టు బాలు గారి నేను నా స్వరకర్తలు కార్యక్రమంలో తనూ కొన్ని పల్లవులు పాడింది.ఇంతకీ ఈ కార్యక్రమం ఎలా సాగిందంటే బాలు గారు తాను పాడిన పాటల స్వరకర్తల గురించి రెండు ముక్కలు చెబుతూ ఓ పాట ఆలపిస్తుంటే నెటి తరం గాయకులు శ్రీ కృష్ణ, అంజనా సౌమ్య, ప్రనవి వినోద్ బాబు, నీహారిక బాలు గారి సోదరి ప్రముఖ గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ నటి అయిన శైలజ గార్లు కొన్ని పల్లవులు ఆలపించారు. సరస్వతి గారి వ్యాఖ్యానానికి బాలు గారు మధ్యలో కౌంటర్ లు వేస్తూ ఎంతో ఉత్సాహంగా సాగిందా సాయంత్రం. శ్రీ కృష్ణ పాడిన హల్లో అంటూ వచ్చి ( అష్టా చమ్మా సినిమా)పాటకీ ఈ సాయంత్రం అతను పాడిన పాటలకీ చాలా తెడా ఉంది. అని నాకనిపించింది. ఇక్కడ అలనాటి గమ్మత్తైన బాలు గారి గళాన్ని భలే పలికించాడు. అలాగే వినోద్ బాబు గారు కూడా అంతే చక్కగా పాడి మెప్పించారు. ఇక అంజనా సౌమ్య, ప్రణవి, నీహారికలు అంతే అధ్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా ప్రణవి సొగసు చూడతరమా పాటని బాలుగారు ఆలపిస్తుంటే ఆమె నవ్విన నవ్వు మరో జానకమ్మో సుశీలమ్మో అవుతుందీ చిన్నారి అనిపించింది. అలాగే అంజనా సౌమ్య పాడిన కృష్నా నీవేగనో బారో …..ప్రార్ధనా గీతం భక్తి పారవశ్యం కలిగించింది. అటు చదువు ఇటు పాట ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తున్న ఈ చిన్నారులు భావి గాన గంధర్వులనటంలో అతిశయోక్తి లేదు. ఇక ఎస్ పి శైలజ అన్నకు తగ్గ చెల్లెలు ఆమె. అంతే వినయం, విధేయత,ఒద్దిక. నిండైన చీర కట్టూ, అప్పటికీ ఇప్పటికీ అదే చురుకైన కంఠ స్వరం వాహ్! అనిపించింది.ప్రియా నాకోరికా గుబాళించేనిక అంటూ బాలు గారితో కలిసి ఆ మెలొడీనీ పాడుతుంటే చాలా బావుంది.
     ఇలా ఆ అమృత తుల్యమైన సాయంత్రం గురించి పుంఖానుపుంఖాలుగా రాయగలను మరో సారి మళ్ళీ రాస్తా….ఇక ఉంటా…
 SPB నేను నా స్వరకర్తలు
SPB నేను నా స్వరకర్తలు
h1

మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి

January 30, 2012

రధ సప్తమి


” సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి”

 

అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేసారా?
చిక్కుడు ఆకులతో రధాన్ని చేసారా?
అన్నం పరవాన్నం/ చక్కెర పొంగలి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టారా?
ఆదిత్య హృదయం చదివారా?

మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి ఈ రోజు(30-01-12)రధ సప్తమి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని పూజిస్తాం ఈ రోజున. సూర్యుడు తన రధాన్ని ఉత్తరాయణ దిశగా మళ్ళించే రోజైన ఈ రోజున రధ సప్తమిగా మహా భారత కాలం నుండీ జరుపుకుంటున్నామని పెద్దల మాట. ఈ రోజే సూర్య భగవానుడి జన్మదినం అనీ మరో సంగతీ పురాణాలు చెబుతున్నాయి. ఎదేమైనా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయర్రా!. ఉదయాన్నే వచ్చే సూర్యుడి కిరణాల్లో మన ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. అంతే కాదు ఉదయాన్న వచ్చే ఆ లేత సూర్యకిరణాలు పలు చర్మ వ్యాధులకూ మందు అనీ అంటారు. అన్నట్టు ఈ రోజున కొన్ని చోట్ల కోదమండ్ర అనీ, కోడళ్ళ పండుగా అనీ వ్యవహారం లో ఉందర్రా! దీని గురించి పెద్దగా విషయాలేమీ తెలీవు నాకు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.

ఈ రోజుకు ముందు రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి, సప్తమి రోజు ఉదయాన్నే మాఘ స్నానం చేస్తే మంచిదనీ మా అమ్మ చెప్పేదర్రా! అప్పట్లో, నదులూ, వాగుల పక్కనా ఊళ్ళుండేవి కాబట్టి అలా మాఘ స్నానమని నదీ స్నానానికి వెళ్ళేవారేమో!
నదీ స్నానం చేసే ముందు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద పెట్టుకుని తీసుకు వెళ్ళి సూర్యోదయ సమయాన ఆ దీపాన్ని నది లో వదిలి స్నానం చేస్తామని మా అమ్మమ్మ చెప్పింది. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది. వీలైతే చూడండి. ( కాలుష్యం నిండిన మన పట్టణాల్లో, ఎటు చూసినా బిల్డింగులే దర్శనమిచ్చే మన పరిసరాల్లో….. ఆకాశం …నక్షత్రాలు ఎన్నడొ మర్చిపోయాం కదూ!)

అన్నట్టు ఈ రోజు సప్తమి కదూ…. సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఉందర్రా! ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ ఏడింటి పేర్లు తెలుసునా!

  • మొదటి కిరణం- సుషుమ్నం
  • రెండవ కిరణం- హరి కేశు
  • మూడవ కిరణం- విశ్వ కర్మ
  • నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
  • ఐదవ కిరణం- సంపద్వసు
  • ఆరవ కిరణం- అర్వాదము
  • ఏడవ కిరణం- స్వరాడ్వసు

ఇవీ ఆ ఏడు కిరణాల పేర్లు. అది సరే కానీ, ఈ రోజున పాలు పొంగించి, నేతి తో తడిపిన బియ్యాన్ని ఆ పాలల్లో ఉడికించి పరవాన్నం సుర్యభగవానుడికి నివేదన చెయ్యాలర్రా! అలా చేసినవాళ్ళు తరిగిన కూర తినకూడదని శాస్త్రం చెబుతొంది. ఈ కాలం లో దొరికే చిక్కుడు కాయలు ఒలిచి కూర చేసుకుని తింటే మంచి బి విటమిన్ అందుతుంది అనీ మరో రకంగా శాస్త్రం చెప్పిందన్నమాట.
అన్నట్టూ మన  దేశం లో ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడికి బోల్డన్ని ఆలయాలు ఉన్నాయి. అదేమిటీ, కోణార్క్, అరసవెల్లి ఈ రెండేగా అంటారా, కానే కాదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి కాశ్మీర్ లోని మార్తాండ్ లోనూ, గుజరాత్ లో మొఢేరా అనీ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించీ మరోసారి చెప్పుకుందాం కానీ , ఇవాళా ఏం చేసినా చెయ్యకపోయినా ఓ సారి ఆదిత్య హృదయం చదవండి.

h1

ఆసక్తికరమైన ఓ వెబ్ సైట్

January 23, 2012

ఇవాళ అలా ఓ సారి అంతర్జాలం తెరవగానే ఓ విషయం కంట పడిందరా! ఆ వివరాలు రాసేసాను. ఇదిగో మీరూ చదవండి.

మధుమేహం ఉన్నవారికై ఓ వెబ్ సైట్

ఇఫ్ యు కెన్ మెజర్ ఇట్ యు కెన్ మెనేజ్ ఇట్—–అనే ఓ సూక్తి ఆధారంగా మధుమేహం తో బాధ పడే వారు ఎప్పటికప్పుడు దానిని పర్యవేక్షిస్తుంటే నిశ్చింతగా ఉండొచ్చనే దిశలో కేర్ లాగర్ అనే ఓ వెబ్ సైట్ ఉందర్రా!

సాధారణం గా ఆన్ లైన్ లో డైరీ రాసుకునే సదుపాయం ఉండే పలు వెబ్ సైట్ లు దర్శనమిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించడానికి వీలైన ఓ వెబ్ సైట్ వచ్చింది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వారు తీసుకుంటున్న మందుల వివరాలు, వారి బరువు, తీసుకునే ఆహారం వంటి విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఆ వివరాలను ప్రపంచం లో ఎక్కడి నుంచైనా వీక్షించే సదుపాయం కల్పిస్తొంది కేర్ లాగర్ డాట్ కామ్. ఈ వివరాలను తమ తమ డాక్టర్లతో నూ పంచుకోవచ్చు. అమెరికాలో ఎక్కువగా మధుమేహ వ్యాధి బారిన పడిన వారు ఉంటుంటారు. వారి కోసమై ఈ వెబ్ సైట్ రూపొందినా అందరూ వారి ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఆ వివరాలతో గ్రాఫ్ లూ చార్ట్ లు రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎప్పటికప్పుడు వారి శారీరక ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, వారికి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ వెబ్ సైట్ లో ఇ మెయిల్ అడ్రస్ ఇచ్చి ఉచితంగా నమోదు చేసుకుని శారీరక ఆరోగ్య వివరాలను పొందు పరచు కోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ చూడండి. https://carelogger.com

h1

మన పండుగలు – పర్వదినాలు

January 17, 2012

ఈ నెల నుంచీ మన పండుగలు ప్రత్యేక పర్వదినాల గురించీ మీ అందరికీ తెలియచెయ్యాలన్న ఆలోచన వచ్చిందర్రా! ఆలోచన వస్తేచాలా, ఆచరణలో పెట్టొద్దూ!!!  ఆలోచన వచ్చింది ఆంగ్ల సంవత్సరాదిరోజైనా ఇన్నాళ్ళకి ఆచరణ సాధ్యమయ్యింది. సరే ఇవిగో ఇక్కడ జనవరి లో ప్రత్యేకతలను తేదీల వారిగా ఇచ్చాను. వాటిల్లో కొన్నిటికి వివరణలూ ఉన్నాయ్. మరి కొన్నిటికి త్వరలోనే చెప్తాను.

. ఇక ఆలస్యం దేనికి, చదవండి, మీ పిల్లలకి చెప్పండి.

జనవరి

1- ఆంగ్ల సంవత్సరాది

5-ముక్కోటి ఏకాదశి

6-కూర్మ ద్వాదశి

7-శని త్రయోదశి

12- సంకట హర చతుర్ధి

14- భొగి

15- మకర సంక్రాంతి

ఉత్తరాయణం

16- కనుమ

17- ముక్కనుమ

21- శని త్రయోదశి

శని త్రయోదశి శని కి చాలా ఇష్టం. ఇది చాలా విశిష్టమైన రోజనీ, శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు అని శాస్త్రం చెబుతోందర్రా.

23- చొల్లంగి అమావాస్య , నాగోబా జాతర, తెప్పతిరునాళ్లు

చొల్లంగి అమావాస్య

పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.

తెప్పతిరునాళ్లు

పుష్య బహుళ అమావాస్య అయిన ఈ రోజు, సింహాచలం కొండ దిగువ భాగంలో ని అడవివరంలో గల ఉద్యానవనం, పుష్కరణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్న కు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్లు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

నాగోబా జాతర

పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన ‘నాగోబా’  పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం.  ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. మనరాష్ట్రం నుంచే కాకుండా పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.

ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర   నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ  సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్‌కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు.  గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.

26- గణతంత్ర దినోత్సవం

28- శ్రీ పంచమి

30- రధ సప్తమి

31- భీష్మాష్టమి

h1

శ్రావణ మాసం విశేషాలు

August 10, 2010

చాంద్రమానం ప్రకారం అయిదవ మాసం శ్రావణ మాసం. పెళ్ళిళ్ళు వ్రతాలు నోములు లాంటి వివిధ విశేషాలతో నిండుగా ఉండే మాసం ఇది. శ్రీ మహా విష్ణువుకు ,శ్రీ మహా లక్ష్మి కీ ఎంతో ప్రీతికరమైన రోజులు ఇవి . ఈ మాసం లో మంగళ,శుక్ర,శని వారాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మంగళ వారాలు మంగళ గౌరీ వ్రతం,రెండవ శుక్రవారం నాడు అంటే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాఖీ అలగే స్వతంత్ర్య దినోత్సవం ఇవే కాదు ఇంకా చాలా విశేషాలు ఈ మాసం లో ఉన్నాయి.శ్రావణం లో తప్పనిసరిగా శనివారాలు శ్రీ మహా విష్ణువు ను పూజిస్తారు. అన్నట్టు ఈ సారి ఇంగ్లీషు నెలల ప్రకారం ఆగష్టు 11 నుండీ శ్రావణ మాసం ప్రారంభం.మరిన్ని విశేషాలు రేపు చెబుతానర్రా!.

h1

శ్రావణం వచ్చేసింది!

August 10, 2010

శ్రావణ లక్ష్మి వచ్చేసిందర్రా! ఇక పండగలే పండగలు.నోములు వ్రతాలు ఒహటేమిటి చెప్పుకోడానికి చాలా ఉన్నై. మరి ఈ మాస విశిష్టత, పండుగలు గురించి రాస్తాను, వస్తూ ఉండండే!

Follow

Get every new post delivered to your Inbox.

Join 240 other followers